ఉదయ రాగం
"ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖతంత్రుల పైన,
జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన....
పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగ."
తెల్లవార బోతోందని పక్షులు కిలకిలారావాలు చేస్తాయో,
లేక పక్షుల కలకలలు విని తూర్పున తెల్లవారుతుందో కాని..
పక్షుల కూజితాలతోనే జగతికి 'మెలకువ' వస్తుంది.
రాత్రంతా అణగారి వున్న గొంతుని విప్పి రెట్డించిన స్వరం తో చేస్తాయి
ఈ రసనాదం! విశ్వవ్యాప్తికి ఆది ఈ సునాదం కాబోలు!!
పక్షుల కు సంబంధించిన ఓ పురాణ కథ చదివాను. ఇంద్రుడు మూడు తలలు ఉన్న విశ్వరూపుడిని చంపినపుడు, ఆ మూడు తలలూ మూడు రకాల పక్షులు గా ఉద్భవించాయిట! కపింజల ( నీరు తాగే చాతక పక్షులు), కలవింగ(పిచుకలు), తిత్తిరి పక్షులు( కౌజు పిట్టలు)!
యాజ్ఞ్యవల్క్య మహర్షి శాపవశాత్తూ, తను నేర్చుకున్న యజర్వేదాన్ని రుధిరంగా కక్కినపుడు, ఈ తిత్తిరి పక్షులు వాటిని తిన్నాయట. అవి తైత్తరేయోపనిషత్తుగా వెలువరించాయట-
ఇందులో వేదాంత పరమైన సూక్ష్మం ఏదో ఉండే ఉంటుంది - పక్షులను ఆత్మకు ప్రతీక గా కూడా చెబుతుంటారు కదా.. అట్లా ఈ పక్షులు తాగేది ఆదిత్యుని ఆధ్యాత్మిక కిరణాలు! ఇది ఉత్ప్రేక్షే!
కాని అవసరమైన ఊహ!
శ్లో.
ద్వా సుపర్ణా సయుజా సఖాయా
సమానం వృక్షం పరిషస్వజాతే
తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి
అనశ్నన్నన్యో అభిచాకశీతి||
(ముండకోపనిషత్తు 3.1.1)
జీవాత్మ, పరమాత్మలకు ప్రతీకగా పక్షి జంటను చెబుతూన్న ఈ శ్లోకం చాలా మందికి తెలిసిందే!
ఒక చెట్టు మీద వాలిన పక్షి జంటలో
ఒకటి పళ్ళని ఆస్వాదిస్తూంటుంది. రెండోది నిర్లిప్తంగా చూస్తుంటుంది. ఈ రెండు పక్షులు జీవాత్మ పరమాత్మలకు ప్రతీకలు. చెట్టు శరీరానికి ప్రతీక.
జీవాత్మ కర్మ ఫలాలను అనుభవిస్తుంది. పరమాత్మకు కర్మలను చెయ్యడం గాని, అనుభవించడం గాని ఉండదు. ఆయన స్సాక్షి మాత్రమే!
చైతన్య స్వరూపుడు, ఆనంద స్వరూపుడు అయిన పరమాత్మను వదలి, సంసార సౌఖ్యాలనే 'నీటి బుడగల' కోసం తాపత్రయ పడుతూ వుంటాం అందరమూ. ఇది కేవలం 'నీటి బుడగ' అని తెలిస్తే, యిక జన్మ రాహిత్యమే అంటారు పెద్దలు!
No comments:
Post a Comment