Monday, 15 December 2025

కోనసీమ ప్రయాణం-2

 




ఇక్కడ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం చూసుకున్నాక, దగ్గరలోనే ఉన్న వేణుగోపాల స్వామివారి ఆలయానికి వెళ్లాం. ఈయన సంతాన వేణు గోపాలస్వామిగా ప్రసిద్ధి. 
అక్కడనుంచి పేరూరు కి- ఆ ఊళ్లోనే మేం వెళ్లాల్సిన ఫంక్షన్. 
 పేరూరు లో మండువా ఇళ్ల గురించి చెబుతూ ఉంటారు. యూట్యూబ్ లో చాలా వివరంగా కూడా వుంటుంది. 
అయితే, నా అనుభవం ఏమిటి అంటే, ఇక్కడి జన జీవనం లయ బద్ధంగా సాగుతున్నట్లు తోచింది. 
దాదాపు గా అన్ని. యిళ్లూ పెంకుటిళ్లు. సంప్రదాయం ఉట్టిపడుతూ తీరైన యిళ్లు. చెట్టూ, చేమ పెరిగే లోగిళ్లు, ముగ్గులు తీర్చిన వాకిళ్లు, వేదపండితులు ఉన్న ఊరు.  కొన్ని యిళ్లలో నాలుగు తరాలవాళ్లు  ఉండటం గమనించాను. చిన్నతనం లోనే వివాహాలు కావడం వల్ల కాబోలు. 


ఇక అక్కడనుంచి పుణ్యక్షేత్రాల దర్శనం మొదలు. 
"అయినవిల్లి" లో స్వయంభువు అయిన సిద్ధి వినాయకుడు, దగ్గరలోనే 'పళ్ళాలమ్మ' అనే గ్రామదేవత ను దర్శించుకున్నాక, ముక్తీశ్వరం లో, త్రేతాయుగం లో శ్రీరాముడు ప్రతిష్టించిన శ్రీ క్షణముక్తీశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లాం.  ఎంతైనా పురాతన ఆలయాలను చూస్తుంటే దేవుడు ప్రత్యక్షం అయినట్టు వుంటుంది కదా!


అక్కడి వాగులూ, వంకలూ.  దారి పొడుగుతా చూసుకుంటూ ప్రయాణం చేశాం. అనుకోని ఆలశ్యం వల్ల చీకటిపడి, అంతర్వేది లో సముద్రాన్ని, గోదావరిని చూడలేకపోయాను. కాని శ్రీలక్ష్మీనరసింహ స్వామి దర్శన భాగ్యం మాత్రం చక్కగా దొరికింది. అటునుంచి కాకినాడకు.

No comments:

Post a Comment