Sunday, 25 March 2018

రామకధా సుధా పానము...

రామ కధా సుధా పానము... ఒక రాజ్యము చేసునే..
‌‌‌‌
"నీకిష్టమైన కథ ఏదైనా చెప్పు". తన ఎదురుగా ఒద్దికగా ఒదిగి కూర్చున్న ఆ సీతాదేవి ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని, అడిగింది ఆవిడ.  వయోభారంతో వంగిన శరీరం, నెరసిన శిరోజాలు, కరుణ వొలికే చూపులు, మందహాసం. మహా పతివ్రత అనసూయా దేవి అత్రి మహాముని భార్య.

అరణ్యవాసం చేస్తూ రాముడు, భరద్వాజ ముని సూచన మేర  సీతా లక్ష్మణ సమేతంగా  చిత్రకూట పర్వతం పైన నివాసం ఏర్పరుచుకొన్నాడు. చిత్రకూట ప్రాంతం ఎంతో అందమైనదే కాదు, ఋషులు మునులు తపస్సు చేసుకొనే ప్రాంతం అవడం వల్ల అతి పవిత్ర మైనది కూడాను. అక్కడే అత్రి,అనసూయలు కూడా నివసిస్తూ ఉంటారు.  కాని, ఆ ప్రాంతంలో ని మునులు రాక్షసుల దాడికి భయపడి కాస్త అసహనం చెంది ఉన్నారు. రాముడు నేనున్నానని అభయమిచ్చినా, వాళ్లంతా ఆ ప్రాంతం వదలి వెళ్లడానికే నిశ్చయించుకొంటారు. జరిగిన సంఘటనలతో (భరతాదులు అక్కడికి రావడం, వగైరా) కొంత కలత చెందిన రాముడు కూడా కొంతకాలమాగి తాము కూడా చిత్రకూట పర్వతాన్ని వదలి వెళ్లడానికి నిర్ణయించుకొంటాడు. ఆ సందర్భంగా, ఒకసారి అత్రి అనసూయ దంపతులను దర్శించుకొందుకు సీతాలక్ష్మణుల తో  వెళ్తాడు.
 ‎
 దివ్యమై గానం గాలిలో తేలి వస్తూంది. పక్కనే సరోజాలతో నిండిన సరస్సు. ఇంకా రకరకాల పక్షులు సందడి చేస్తూ ఎంతో రమణీయంగా ఉంది.

వెళ్తూనే ఆ దివ్య దంపతులకు ప్రణమిల్లాడు. ఆ దంపతులు వారి తో అనునయింగా మాట్లాడారు. అత్రి మహాముని అనసూయా దేవి తపశ్శక్తి గురించి  వారికి పరిచయం చేస్తాడు. ఒకప్పుడు వర్షంలేక పదేళ్ళపాటు కరువువస్తే ఈమె తన తపశ్శక్తితో గంగను ప్రవహింప జేసి మునులకు ఫల మూలాలు ఉత్పత్తి అయేటట్టు చేసింది. ఇంతటి మహిమాన్విత అయిన ఈమె నీకు తల్లి వంటిది అంటాడు రాముడి తో. అటువంటి మహా తపస్వి అయిన సతీ అనసూయ దగ్గర కావలిసిన ఉపదేశం పొందవలసిందిగా రాముడు సీతాదేవి తో అంటాడు.

ఇల్లాలి ధర్మాలు ఉపదేశించమని వచ్చిన సీతాదేవి చేయిపుచ్చుకొని తనతో లోపలికి తీసుకు వెళ్లింది. "నీగురించి విన్నానమ్మా సీతా...! అన్నీ వదలి ఇంత లేత వయసులో భర్త వెంట అడవి కి రావడం ఉన్నదే...సామాన్య విషయం కాదు. అదృష్ట వంతురాలివి ధీరుడు..సత్యవర్తనుడైన భర్త లభించాడు నీకు.. భర్తను అనుసరించి ఉండటం మించి ప్రతివతా ధర్మమేమున్నది" అన్నది.

సీత ప్రాంజలి ఘటిస్తూ..."అమ్మా  అంతా మీ ఆశీస్సులు....
నా భర్త గుణగణాలు ప్రత్యేకించి చెప్పవలసినదేముంది. తాను దయామయుడు...జితేంద్రయుడు,ధర్మనిరతుడు పితృభక్తి కలవాడు. నా భర్తే నాకు తల్లి తండ్రీ..బాంధవ్యుడు.అటువంటి నా భర్తను అనుసరించడం నా ధర్మం అందులో గొప్పదనం ఏముంది. 
కాని మీ తపశ్శక్తి సాటిలేనిది... భీకరమైన కరవు ని ఎదుర్కోటానికి మీరు చేసిన పోరాటం అనితర సాధ్యమమ్మా..!'

"అవును సీతా పోరాటమే...సరిగ్గా చెప్పావ్.  మహా కరువు వచ్చింది. వర్షాలు లేవు...ఒకటా,రెండా పది సంవత్సరాలు.
జనం బాధ వర్ణనాతీతం అనుకో. అప్పుడే సంయమనం కావాలి. ఇదిగో ఈ ఫల వృక్షాలన్నీ ఆనాటి కృషి ఫలితమే. మన్నించి తన దారి మళ్లించుకొని ప్రవహించినంత మేర  సస్యశ్యామలం చేస్తున్న గంగాదేవి కి కృతజ్ఞతలు. అయినా మహా జ్ఞానులైన ఋషులు చేసే కృషి ముందు ఇది ఎంత".

సీతాదేవి ఆ పూజ్యురాలి కేసి ఆరాధనగా చూసింది.
"మీ ఉపదేశం నాకు శిరోధార్యము. నా అత్తగారు, నా తల్లి చెప్పిన హితవచనాలే నాకు గుర్తుకొస్తున్నాయి. " వినయంగా పలికింది సీత.

"మైథిలీ! ఎంత మధురంగా ఉన్నాయి నీ మాటలు!  ఏదైనా ఒక వరం కోరుకో నా తపశ్శక్తితో ఇవ్వగలను అని అడిగింది. దానికి సీత  మందహాసం చేసి తీయని మీ ఆశీర్వచన పలుకులే చాలన్నది. అయినా, అనసూయ తన వద్ద ఉన్న దివ్యాభరణాలను, వస్త్రాలు, అలంకరణ వస్తువులు సీత ముందు ఉంచింది.

ఆ తర్వాత ఆ మాటా ఈమాట చెప్తూ...

"నీకిష్టమైన కథ ఏదైనా చెప్పరాదా" అని అడిగింది. మెత్తని మధురమైన  సీత మాటలు వినాలనే కోరిక

"సరే ఏదో ఎందుకు, మీ వివాహం ఎలా జరిగిందో వివరించు?
స్వయంవరంలో శ్రీరాముడు నిన్ను అర్ధాంగి గా పొందిన సంగతి,
 లోగడ విన్నా కాని, సీతా ! సవిస్తరంగా నీనోట వినాలని ఉంది.  చెప్పవూ...!" మురిపెంగా అడిగింది

సీత ఒకసారి సాలోచనగా చూసి...మృదుమధురమైన తన స్వరం తో చెప్పడం మొదలు పెట్టింది.
 'నాన్నగారు జనకమహారాజు ఒకసారి నాగలి చేతబట్టి యజ్ణభూమి దున్నతుంటే నేను భూమిని చీల్చుకొని బయట పడ్డానట...ఆ సమయంలో తన చేతిలోని చల్లుతున్న ధాన్యపు విత్తనాలు, మట్టి నా పై బడి పూర్తిగా దుమ్ము కొట్టుకు పోయిన నన్ను ఆయన ఆత్రంగా లేవదేసి తన హృదయానికి హత్తుకున్నారట.
 ‎అపుడు 'ఓ రాజా ఈమె మానవ శిశువు కాదు... దివ్య శిశువు.. ధర్మము గా నీకు కుమార్తె' అని అశరీరవాణి పలికిందిట.
వారి కి సంతానం కూడా లేకపోవడంతో  నన్ను అమ్మకు కానుకగా చేతిలోపెట్టి వాళ్ల బిడ్డ లాగే సాక సాగారు. అయితే అందరి తండ్రులలాగే నాకు వివాహ వయసు రాగానే ఎటువంటి వరుని తేవాలా అని మధనపడుతూండేవారు.

వివాహానికైనా, వివాదానికైనా సమోద్యులు ఉండాలంటారు కదా.  అందునా నేను అయోనిజను ...అందుకు తగిన ఉత్తమమైన వరుడు గురించే వారి యోచన‌.  ..."
ఒక్క క్షణం ఆగింది..తెలియని విచార రేఖ పొడసూపగా..

అనసూయాదేవి ఆమె చెంపలు సవరిస్తూ..అన్నది
"...ఇదేమీ విపరీతమైన విషయం కాదు సీతా...నీకు తెలుసా , అత్రిమహాముని...కూడా అయోనిజులే...బ్రహ్మ మానస పుత్రులు..! సీతా నీవు కూడా కారణ జన్మురాలివి అమ్మా
చెప్పు ఆ తర్వాత?"

విప్పారిన కళ్లతో ఆమె చెప్పినది విని ..కొనసాగించింది తనకథనం..." అందుకేననుకొంటానమ్మా..నా జనకుడు స్వయంవరం ప్రకటించాలనుకొన్నారు..
అయితే మా నాన్న గారి వద్ద పూర్వీకుల నుంచీ తనకు వచ్చిన ఒక భారీ శివధనస్సు ఉంది. నిమి వంశంలో జనకుడి కంటే పూర్వజుడైన దేవరాతుడు మహాయజ్ఞం  చేస్తుండగా,ప్రసన్నుడై శివుడే స్వయంగా ఇచ్చాడట. ఆ ధనువును ఒకచోట నుండి మరొక చోటకి కదపడానికే..ఐదు వందల మంది మనుషులు కావాలి.  మా మానాన్నగారు ‌నాకు స్వయం వరం ప్రకటించారు. అటువంటి శివధనువు వంచిన వారికి నన్ను ఇచ్చి వివాహం చేస్తానని స్వయంవరం ప్రకటించారు నా తండ్రి. దేశ విదేశాల రాజులు, యువరాజులు శివ ధనస్సు  ఎత్తలేక అశక్తులై రెండు చేతులు జోడించి మరలి పోయారు.
 ‎
ఇది జరిగిన కొంతకాలానికి, విశ్వామితృల వారు తన వెంట రామ లక్ష్మణులను తీసుకొని, మా నాన్నగారు చేస్తున్న యజ్ణం
చూసేందుకు మిథిలకు వచ్చారు. ధర్మనిరుతుడైన నా తండ్రి వారిని తగినరీతి సత్కరించారు.

" ఓ రాజా ఇతడు శ్రీ రాముడు, అతడు లక్ష్మణుడు.. వీరిద్దరూ అన్నదమ్ములు, అయోధ్యాధిపతి దశరథుని కుమారులు. మీ దగ్గర ఉన్న శివ ధనస్సు చూడాలని ఉబలాట పడుతున్నారు... ఆ దివ్య ధనస్సు శ్రీ రామునికి చూపించండి" అని విశ్వామిత్రుల వారు  నా తండ్రి జనకమహారాజు తో చెప్పారు.

వెంటనే ఆ శివధనువు వారి దగ్గర కి చేర్చబడింది. మహా పరాక్రమవంతుడైన రఘురాముడు తృటి కాలం లో ధనస్సు వంచి వింటి నారిని సంధించగా...   వెంటనే శివధనువు ఫెళఫెళ ధ్వనులతో విరిగి ముక్కలయ్యింది..అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారి ఉలిక్కి పడ్డారు ఆ ధ్వనికి.

"...సీతా మరి నీకు భయం వేయలేదా?"

" ఒక్కసారిగా ఒళ్లు ఝల్లు మన్నమాట నిజం" జ్ఞప్తికి తెచ్చుకొన్నట్టుగా ...తిరిగి పులకాంకిత అవుతూ అంది సీత.

"అపుడు నీవు రాముని చూశావా? రాముడు నిన్ను చూశాడా?"
ఈ పృచ్ఛగింపుకు కొంత సిగ్గుపడి.... నిమీలిత నేత్రాలతో...
" ..... బహుశా ఒకేసారి కావచ్చు.. "
" ఆ తర్వాత...? "
"ఆ తర్వాత అన్నమాట ప్రకారం నా  తండ్రి జనకుడు శ్రీ రాముని కాళ్లుకడిగి కన్య దానా నికి ఉపక్రమించబోగా, శ్రీరాముడు తనతండ్రి దశరథ మహారాజు అనుమతి కావాలనగానే, నా తండ్రి వెంటనే నా మామ గారైన దశరథులవారికి కబురు చేసి మిథిలకు పిలిపించారు.

ఆ విధంగా స్వయంవర విధానాన, మహా వీరులలోశ్రేష్టుడు అయిన నా భర్తకు సహధర్మచారిణి అయ్యాను.

సీత మాటలు పూర్తవతూనే...అనసూయాదేవి తనను దగ్గరకు తీసుకొని గాఢంగా హృదయానికి హత్తుకొంటూ...శిరస్సు ను ముద్దాడింది.

అప్పటికే  సాయంకాలం అయింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. బయట చల్లగాలులు తిరుగుతున్నాయి.హడావుడిగా గూటికి చేరే పక్షులు చేసే వింత శబ్దాలతో నిండిపోయింది. మునులంతా నదిలో సంధ్యా స్నానాలు చేసి ఇంటి ముఖం పట్టారు. హోమవాటికలోంచి వచ్చే ఎర్రని సెగ...పలుచని పొగ తో అంతా ఓ పవిత్ర వాతావరణం ఏర్పడింది. బయట అంతా  మసక మసగ్గా అగుపిస్తోంది...ఆకులు కొద్దిగానే ఉన్నప్పటికీ... చీకటి పొగ కలిపి అంతా దట్టంగా  అగుపిస్తోంది.

"సీతా...!  ఎంత బాగా చెప్పావమ్మా! మనసు నిండిపోయింది. తనివితీరదు కదా. అయినా  బాగా పొద్దు పోయింది. నక్షత్రాలు కాంతివంతమయ్యాయి....చంద్రుడు తనవెలుగులను విస్తరింపచేస్తున్నాడు.రాత్రి అయింది. ఇక నీవు నీ పతి సేవకు వెళ్లాలి కదమ్మా!  ఏదీ వెళ్లేముందు నీ అలంకారాలు చూడనీయి."  అంటూ తన వద్దన ఉన్న నగలు,వస్త్రాలను ఆమెకు అలంకరించింది. దివ్యకాంతి తో వెలిగిపోయే సీతమ్మ ను చూసి ఎంతో ఆనందపడింది. సీతాదేవి కూడా ఆమెకు వంగి నమస్కరించింది.. సర్వాలంకృత అయిన సీతాదేవి ని శ్రీరామ చంద్రుడు... విస్మయం తోనూ సంతోషంతోనూ చూశాడు. ఒక. మహా సాధ్వి,మహా తపః సంపన్నురాలు...అనురాగంతో సీతకిచ్చిన కానుకలవి. వసివాడనివి.

అలాగే తక్కిన ఆశ్రమవాసులు,తాపసులు రాముణ్ణి ఎంతో సత్కరించి అతిధి మర్యాదలు చేసారు. ఆ రాత్రికి వాళ్లు అక్కడే విశ్రాంతి తీసుకొన్నారు. తిరుగు ప్రాయాణానాకి వారందరి అనుమతి తీసుకొని అక్కడనుంచి బయలు దేరారు.  నరమాంస భక్షకులైన రాక్షసులనుంచి తప్పించుకోవడానికి మునులు కందమూలాలు, ఫలాలకోసం వెళ్లే మార్గం ఒకటి ఉంది ఆ దారి చూపుతాను వెళ్లండి అని అత్రి  చెప్పగా వాళ్ళు అదేవిధంగా అక్కడనుండి  దండకారణ్యం వేపు నడవడం మొదలుపెట్టారు.

_వాల్మీకి రామాయణంలో అయోధ్య కాండ ఆధారంగా
.సీతారామలక్ష్మణులు అత్రి అనసూయ ల సందర్శించిన సందర్భంలో..











 ‎













  1. .

Thursday, 15 March 2018

అమ్మ జ్ఞాపకం

ఒక జ్ఞాపకం

నిను సేవించినఁ గల్గు మానవులకున్ వీటీ వధూటీ ఘటీ
ఘనకోటీ శకటీ కటీ తటిపటీ గందేభ వాటీ పటీ
రనటీ హారి సువర్ణహార మకుటీ ప్రఛ్ఛోటికా పేటికల్ ,
కన దామ్నాయ మహాతురంగ! శివలింగా! నీలకంఠేశ్వరా!

ఈ పద్యం నీకు తెలుసా అని అమ్మ నన్ను అడుగుతూ,  తిరిగి తనే ఆ పద్యాన్ని గుక్క తిప్పుకోకుండా చెప్పింది.

టి.వి. లో ఏదో సినిమా ఫంక్షన్. సాధారణంగా ఏదో కళ్లప్పగించి చూడటమేగాని, ఏ జరుగుతోందో బుర్రకెక్కదు.
అలాంటి టైమ్ లో పూర్తి గా శబ్దాలంకారం ఉన్న పై పద్యం వల్లించారెవరో..ఎవరోకాదు...రచయిత... తనికెళ్ళ భరణి.

ఇది జరిగిన కొన్నాళ్ళకు.. అమ్మ వెళ్ళి పోయింది. ఇప్పటికి ఐదేళ్లు అయింది. కాని నాకు ఆనాటి ఈ పద్యం మనసులో మెదులుతూ ఉంటుంది.

మా అమ్మ గొప్ప సాహిత్య అభిమాని. భాగవతం లో పద్యాలన్నీ నోటికి వచ్చు. ఎపుడైనా మేము తడుముకొంటుంటే ఆ మాత్రం తెలియదా అన్నట్టు చెప్తూ ఉండడం మాకు అలవాటే. ఆవిడకు ఇష్టమైన పద్యాలలో, మందార మకరంద మాధుర్యము....కూడా ఒకటి.

నేడు అమ్మ పుణ్య తిధి..పద్యాలతో ఆవిడకు ఉన్న పరిచయాలలో ఇదో గుర్తు.

తొలకరి- సంగం పద్యం

తొలకరి వాన లో తడిసి కరుగుతున్న ఎర్రమట్టి....
దాని తాలూకు పరిమళాలు...
నీరు, మట్టి...కలిసిపోయి‌న..ఎర్రమట్టి నీళ్లు
కలిసిన వారి ప్రేమైక హృదయాలలాగే..

 ఈ పరిమళాలు ఎలా అందాయి? నాకా భాష తెలీదు..భావం అంతూ పట్టలేదు. పాట కట్టి పడేసింది.
 ‎
యాయుమ్ యాయూమ్...యూట్యుబ్ లో   సిక్కిల్ గురుచరణ్ చక్కని ఆలాపన తో మొదలైన ఈ పద్యం(పాట?) తేనెల సోనలా.. తాకింది......
"అంబుదై........నెన్జం .....థామ్ కలన్ ధనవె"

"వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఆమెకేమో తమ ప్రేమ ఫలిస్తుందా లేదా అని బెంగ‌. అతడామెకు ధైర్యం చెప్తున్నాడు.తమది మేనరికం కాదు, ఎలాటి బంధుత్వం లేదు అయినప్పటికీ, తమనెవ్వరూ వేరు చేయలేరనీ...వర్షపునీరు ఎర్రమట్టి లో కలిసి ఎర్రనీరుగా మారినట్లు... తమ ప్రేమైక హృదయాలు కలిసే ఉంటాయని."

లింక్ పోస్ట్ చేస్తూ నా తమిళ ఫ్రండ్ ని అడిగాను. నేనది ఇంకా మళయాళం అనుకొన్నా. అది ప్రాచీన తమిళ భాషకు చెందిన సంగం సాహిత్యం లోనిది అని,అందులో పదాలు తనకూ అర్ధం కావని చెపుతూ..సొంతంగా తనూ సెర్చ్ చేసి..అన్ని వివరంగా ఉన్న ఒక బ్లాగ్ లింక్ పంపింది.

"yaayum ngyaayum yaaraagiyaro?
endhaiyum nundhaiyum emmuraik kelir?
yaanum neeyum evvazhi aridhum?
sembulap peyal neer pola
anbudai nenjam thaam kalandhanave"

My mother and your mother,
what kinship are they?
My father and your father, how related are they?
I and you, how do we know each other?
Like red soil with rain water
Earnest hearts in love became one forever

సంగం సాహిత్యం దాదాపు రెండు వేల సంవత్సరాల నాటిది. నా వెతుకులాట లో తెలిసింది ఏమిటంటే. సంగం సాహిత్య సంకలనం లో దాదాపు ఐదు వందలు పైగా కవులు ఉన్నారు. చాలామంది అజ్ఞాత కవులు.  వీరంతా సంగం గా ఏర్పడి తమతమ కవిత్వం ప్రచురించే వారట. ఇటువంటి సభలు నేటి మధురై లో సముద్రం లో కలిసిపోయిన భాగంలో.... రెండుసార్లు, మూడవసారి మీనాక్షి అమ్మవారి గుడి ప్రాంగణంలో స్వర్ణ కోనేరులో జరిగాయి ట. (ఎలాటి నిరూపణ లేదుట). కాని సాహిత్యం ఉందిగా..  ఈ సాహిత్యం తమిళుల సంపద.ఈ సాహిత్యం ముఖ్యంగా ప్రేమ, యుద్ధం, ప్రజాపాలన, వ్యాపారం మరియు ఎడబాటు వంటి విషయాలపై ఉన్నాయి.

పురాతత్వ ఆధారల ప్రకారం మదురై ఇంకా సంగంకి సంబంధించిన శాసనం 10వ శతాబ్దానికి సంబంధించినదే ఆధారంగా ఉంది.

ఈ రోజు ఒక కొత్త విషయం తెలిసింది.



http://www.kutcheribuzz.com/kb-special/kb-interviews/291-exploring-new-worlds

https://youtu.be/rjqbJQA3XAs

10/03/2018