Friday, 21 November 2025

ఉదయరాగం

 






 హేమంత ఋతువు

కిందటి వారం దాకా ఉదయాన్నే గంగ వొడ్డున తిరుగుతూ, సూరీడు జారవిడిచిన నారింజరంగు చీరను చుట్టుకున్న గంగమ్మ తరంగాలలో స్నానించిన నాకు.. ఆ వెచ్చదనం ఇంకా స్వప్నం లాగే ఉంది!

ఇప్పుడిక్కడ  చలి బాగా పెరిగింది.. 
ఇక్కడో ఋతువు తెల్లటి పరదా చాటు చేసుకుని ఇళ్లల్లోకి జొరబడిపోయింది.. !
నందివర్ధనం పూవొకటి మంచు చినుకుని ఢీ కొని చెట్టు గుబురు పైనుంచి ఠీవి గా తలెత్తింది..
మాలతీ తీగకు గుత్తులుగా గిన్నె మాలతీలు విరబూసాయి!
బంతులు, చేమంతులు ఈ ఋతువు మాదేనన్నాయి..గర్వంగా!
 --  ఎంతో యిష్టంగా మంచు బిందువులను ముత్యాల్లా ధరించిన లేత గడ్డి పరకలూ.. సరేసరి..వస్తూ వస్తూ శీతాకాలం బహుకరించిన ముత్యాలహారాన్ని గర్వంగా చూస్తూ దక్షిణం వైపుకి తలతిప్పాయి!
 
*"మాసానాం మార్గశీర్షోఽహమ్"*
అని పలికిన  శ్రీకృష్ణుడికి యిష్టమైన *మార్గశిర మాసం!* వచ్చేసింది.

శరదృతువు వెళ్లి హేమంత ఋతువు ప్రవేశించింది. 
ఇది  *శ్రీరామచంద్రుడికి యిష్టమైన ఋతువు!*

*శరదృతువు వెళ్లి నీకిష్టమైన హేమంత ఋతువు ప్రవేశించింది* అని అంటాడు లక్ష్మణుడు శ్రీరాముడితో!"
అరణ్య కాండలో.. అవి శ్రీరాముడు సీతా,లక్ష్మణులతో పంచవటి లో నివాసం ఉన్న రోజులు.. 
శీతాకాలం-
సూర్యుడు చంద్రుడిలా చల్లగా అనిపించే- వెలుగొందే కాలం;
ఉదయం వేళ సూర్య కిరణాలు తెలుపు పసుపు వన్నెలు తిరిగి చల్లగా ఉంటుంది.
పచ్చని గడ్డి పరకల మీద మంచు బిందువులు నిలిచి ముత్యాల్లా మెరుస్తూ వుంటాయి.
పొగమంచు చే కప్పబడిన నదీ జలాల ఉనికి బెగ్గురు పక్షులు తమ కిలకిలారావములతో తెలియచేస్తుంటాయి.
మధ్యాహ్నం వేళలో సూర్యకిరణాల స్పర్శ సుఖాన్నిస్తాయి!  అని అభివర్ణిస్తారు అరణ్యకాండ లో ఆదికవి వాల్మీకి.

అంతే కాదు శీతాకాలం.. భగవత్ చింతన కల వారందరికీ బహుపుణ్య కాలం!
అందరికీ మార్గశిర మాస శుభాకాంక్షలు!🌺🌺🙏

Wednesday, 19 November 2025





 కాశీ వాసం


"పరా, వైఖరీ ప్రయాణమైనాయి

 ఆయన రూపం చూచి వచ్చి చెబుదామని

 సింధువు చూడాలని గంగ వెళ్లినట్లు."

(అమృతానుభవం-  జ్ఞానదేవ్)

సరిగ్గా అందరం ఇంతే..  కాశీవాసానంతరం ఏదైతే వుందని అనుకుంటామో.. అదీ లుప్తమైపోతుంది!

తొమ్మిది రోజుల కాశీవాసం తరువాత మొన్న శనివారం15th November'25- సాయంత్రం తిరిగి వచ్చాను. 

గంగా స్నానం, డూంఢి గణపతిని,సాక్షి గణపతిని వేడుకుంటూ--కాశీ విశ్వనాథుడు, విశాలక్షీ,అన్నపూర్ణలను దర్శించుకోవడం. 

"సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో.."  -

విశ్వనాథుని సందర్శన కోసం విధిగా సాగించిన నడక ప్రదక్షిణ కాగా, మేమాడుకునే మాటలన్నీ స్తోత్రాలే అయి; ఆనందవనమనే కాశీ సందర్శనం లో  మనసూ శరీరం మరో ఆలోచన లేని స్థితి కి వచ్చేస్తాయి. 

ఇక పోతే, సత్రం లో భోజనం, మఠంలో అలుపెరగని నిద్ర .. ఇదండీ మా నిత్యకృత్యం. చూడదగ్గ వన్నీ చాలా వరకు చూశాం .. శ్రీనాథు మహాశయుడు అన్నట్టు‘ప్రాయమింతకు మిగుల గై వ్రాలకుండ’ ఇప్పుడైతే తిరగాను కాని, ఇకముందు శివయ్య దయ!🙏🌺🌺


Wednesday, 5 November 2025

ఉదయ రాగం


ఉదయ రాగం.


శరత్పూర్ణిమ


రావే రాధ రాణి రావే..

రాధ నీవే కృష్ణుడు నేనే ..

రమ్యమైన శారద రాత్రి..

రాసలీల వేళ యిదే !

రాసలీల వేళ యిదే !


అవునండీ.. సినిమా పాటే.. నాకూ ఈ నాలుగు ముక్కలకు మించి గుర్తులేదు‌.‌ కాని శారద రాత్రి గురించి ఓ చక్కని  పాట కాదా..ఈ శరత్కాలం అంతా వెన్నెల వేళలదీను.

రాస లీలా వేళ యిదే..!


అలనాడు శ్రీకృష్ణుడు శరత్పూర్ణిమ రోజున బృందావనం లో జరిపే రాసకేళి..పోతన భాగవతం లో అద్భుతంగా వర్ణించారు.


కర్ణావతంసిత కర్ణికారప్రభ;

గండభాగద్యుతిఁ గడలుకొలుప

భువనమోహనమైన భ్రూవిలాసంబుతో;

వామభాగానతవదన మొప్ప

నపసవ్యకర మృదులాంగుళీ చాతురి;

షడ్జధ్వనికి మర్మసరణిఁ జూప

డాకాలిమీఁద నడ్డము చాఁచి నిల్పిన;

పదనఖద్యుతి భూమిఁ బ్రబ్బికొనఁగ


మౌళిపింఛముఁ గంఠదామమును మెఱయ

విలసితగ్రామముగ నొక్క వేణువందు

బ్రహ్మగాంధర్వగీతంబు పరఁగఁ జేసెఁ

జతురనటమూర్తి గోపాలచక్రవర్తి.


అలా బృందావనం లో.. 

తెల్లటి శరద్రాత్రి వెన్నెల పరచుకుని ఉండగా..

శ్రీకృష్ణుడు వేణువు ఊదడం మొదలు పెట్టాడు... 

మంద్రంగా మొదలై.. 

మధ్యమ,తార స్థాయిలలో రాగాలాపనలు చేస్తూ.....  

స్వరాలు.. కళలూ, జాతులూ, ఆరోహాణా..అవరోహణములు తెలిపేటట్లు అవ్యక్త మధురంగా సాగింది ఆ వేణు గానం. 

ఆ మధుర మంజుల నాదానికి గోపస్త్రీ లంతా బిలబిల లాడుతూ  వచ్చారు.  ఆనాటి బృందావనంలో.. అది శ్రీ కృష్ణుని రసరమ్య రాసకేళి..!


ఆతని మధుర మంజుల వేణుగానం వినడానికి  ఉత్సుకతతో ఓ నాడు కైలాస పర్వతం మీద తపస్సు వీడి, శివుడు వస్తాడుట.  అదీ అందమైన గోపస్త్రీ రూపం లో వచ్చి నృత్యం చేస్తాడు.. 

వేణుగానానికి పోటీయా అన్నట్టుండే విధంగా!

పున్నమి వెన్నెల తో  సాటి అన్న చందాన వెన్నలాటి తెలుపు- లావణ్యం కల 'శివుడు' చేసే ఆ నృత్యం- లాస్యం అనాలేమో-

అందరినీ ముగ్దులను చేస్తుంది. 

మరేమో.. గోపికా రూపధారి శివుని మూడోకన్ను పట్టి యిచ్చేస్తుందిట!

శ్రీకృష్ణుడూ వచ్చినదెవరో గ్రహించి నమస్కరిస్తాడుట. ఆవిధంగా శివుడు గోపీశ్వరుడు అయ్యాడట! అందుకు నిదర్శనం గా కృష్ణుని మునిమనుమడు వజ్రనాభుడు కట్టించిన మహదేవుని ఆలయం  'గోపేశ్వర్ మహదేవ్' మందిరం ఉత్తరాఖండ్ లో ఉంది. 


మనకు ఈ సారి నవంబర్ నెల రాకుండానే 

సగం రుతువు అయిపోయింది. అదీ కాకుండా అకాల వర్షాలు..

ఇవాళ చంద్రుడు కనబడతాడా అన్నది సందేహమే..! 

అయినా పగటి వెన్నెలలాటి శరత్కాలం ఇంకా పదిహేను రోజులు వుంది. ఆనక వచ్చే హేమంతం లోనూ చలిగాలులకి శరీరం ముడుచుకు పోతున్నా, మనసున మాత్రం ఆధ్యాత్మిక చింతన మరింత ధృఢమై శివవకేశవులను ఆరాధన కొనసాగుతూనే వుంటుంది.