Thursday, 18 October 2018

నీలి కురింజి

ఓ పూవు పూసింది


పన్నెండు సంవత్సరాల కి ఒకసారి పూసే పూలు ' నీలికురింజి' పూలు. ఇవి పశ్చిమ కనుమల్లో పూస్తాయి.

ఈ సారీ పూసాయి. కాని కాస్త ఆలస్యంగా.  కేరళ.. మున్నార్ ప్రాంతం అంతా ఈ పూల సంబరాలకి, అందుకోసం వచ్చే యాత్రీకులను, దృష్టిలో పెట్టుకుని ని ఎదురు చూస్తూంటే, అనుకోని విపత్తు... వర్షాలు, వరద‌..విలయతాండవమే చేసింది ప్రకృతి. అది తీవ్రమైన విఘాతం ..  చెట్ల న్నీ మళ్ళీ పచ్చదనం తొడుక్కున్న సమాచారం. నీలి కురింజి ..పూలు పుష్పించాయి..పర్వత కనుమలు... అందాలు చూడడానికి ఆహ్వానం పలికింది.

అందుచేత మున్నార్ ప్రయాణం పెట్టుకొన్నాం. అయితే ఈ పూలు చూడాలంటే...Eravikulam national park కి వెళ్లాలి. మున్నార్ పట్టణం నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంది. దాదాపు 97 చదరపు కి.మీ విస్తీర్ణం ఉన్న ఈ పార్క్ అన్నమలై నుంచి తమిళనాడులోని పళని కొండలవరుకు ఉన్న అటవీ ప్రాంతపు అంతర్భాగం. కేరళ అటవీ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది ఈ నేషనల్ పార్క్.  ఇంకా లోపలకు వెళ్లడానికి అటవీ శాఖ వారికి, అక్కడి ట్రైబల్స్ కి తప్ప ఎవరికీ అనుమతి లేదు. ఇకడికి చేరుకోటానికి  మన ప్రైవేటు వాహనాలు అనుమతించరు. టికెట్ కొనుక్కొని  అటవీ శాఖ వారి వాహనం లో వెళ్లాలి. కొంత దూరం లో వదిలి వేస్తారు. 
అక్కడ్నుంచి దాదాపు రెండు కి.మీ. దూరం ట్రెక్కింగ్ ఉంది.

నీలి కురింజి పూల ను వెతుక్కుంటూ వెళ్లాం. కొన్ని చోట్ల తప్ప,
ఇవి ఆశించినంతగా విరగబూయ లేదు.

కాకపోతే, వానమబ్బుల్లోంచి నడుస్తూ, పచ్చదనాలను చూస్తూ...చిన్న చిన్న నీటి ప్రవాహాలను చూస్తూ.. నడిచినంత మేరా...చాలా బాగుంది.  పర్యాటకులు కూడా చాలామంది వచ్చారు. ఇంకా వస్తున్నారు.
మరి, పన్నెండు సంవత్సరాల కు ఓసారి పూసే ఈ పూలు..ఎలా ఉంటాయో అనే కుతూహలమే!

ఈ అపురూపమైన పూవుకి ఓ ఫోటో తీశాను

సంగం సాహిత్యం లో  కురింజి తిన్నై అనే పద్యాలతో కూడిన భాగం ఉంది‌.  అంటే,  ఈ కురింజి పుష్పాలపేరే...!
ఎంత అందమైన పేరు ఈ కవిత్వానిది!
 'కురింజి తిన్నై'. అందమైన ఈ పడమటి కనుమల్లో ఉండే  జన జీవనానికి సంబంధించినదీ కవిత్వం.

అనేకమంది కవులు  ఒకే విధంగా రాసి సంకలనం చేసిన చిన్న చిన్న పదాలతో కూడిన  పద్యాలు గా చెప్పబడినవన్నీ ఎనిమిది ప్రకరణాలుగా విభజింప బడ్డాయి. 'ఎట్టు తొంగై' అంటారు అన్నిటినీ కలిపి. ఒక్కో ప్రకరణానికి ఒక్కో పేరు ఉంది.
ఎలా అంటే ప్రజల జీవన విధానం వారు జీవించే నేల లేదా నైసర్గిక స్వరూపాన్ని బట్టి ఉంటుంది. వీటిని ఐదు ' తిన్నై' లు గా వర్గీకరించారు. ఇవి వరుసగా కురింజి, ముల్లై, మారుతమ్, నైతాల్, పాలమ్.
కొండ ప్రాంతం అంతా కురింజి అని, అడవి ప్రాంతం భూమి మలై అని, సముద్ర ప్రాంతం లో భూములు నైతాల్, చదునుగా ఉన్న భూభాగం మారుతం‌‌. చివరగా 'పాలమ్'  ప్రాంతం విడిగా ఏమీ లేదు కాని, వర్షాభావం వల్ల బీడుగ మారిన అడవి, కొండ ప్రాంతాలు..ఇందులో వర్గీకరించారు.

కురింజి తిన్నై పద్యాలు ప్రేమికుల రహస్య సమావేశాలు, వారి ప్రేమ ,పెళ్ళి ల పై..రేగే పుకార్లు.....ప్రేమికుల సమాగమం ప్రధానాంశంగా ఉంటాయి కురింజి తిన్నై పదాలు.

కవిత్వ కాలం ' కుళిర్' కాలం...చల్లని సమయాలు..ఈ ప్రాంతంలో అక్టోబర్ మధ్య నుంచి నవంబరు మధ్య దాక, తమిళం లో 'అయిప్పాసి' అంటారుట. (మన ఆశ్వయుజ మాసం లాగా). బహుశా, అంత ముందు కురిసిన వానలకి ఆ కొండ ప్రాంతం లో ఏర్పడిన చిన్న చిన్న జలపాతాలు..పచ్చని చెట్లు..వలసవచ్చిన పక్షులకిలకిలు. ఓ చల్లని వాతావరణం ఏర్పడుతుంది.

 ప్రేమలో పడ్డాక..ఒకరినొకరు చూడకుండా ఉండలేరట.ఒకానొక పడచు తన నెచ్చెలి ప్రణయ బాధను ఇలా అన్యాపదేసంగా చెప్తోంది ఇలా..

అర్థరాత్రి రావద్దు.

కొమ్మల్లో వేలాడుతూ దూకే నల్ల కళ్ల మగ కోతి ప్రమాదవశాత్తు చనిపోతే, తన మగని మరణాన్ని సహించలేని ఆడ కోతి తన పసి బిడ్డను తనవాళ్లకి అప్పగించి తనూ ఎత్తైన కొండమీదనుంచి దూకడానికి సిద్ధమైంది. గిరి సంచారకా..నీవు మాత్రం అర్ధరాత్రి రాకు. చిరాయడవు కా. మాకు కష్టం కలిగించద్దు సుమా!

ఎంతో అలవాటు గా కొండల అంచుల్లో దూకే కోతే ఓ రాత్రిపూట పట్టుదప్పి ప్రాణాలు పోగొట్టుకొంది. అంటే ఈ కొండదారి ప్రమాదకరం సుమా అంటూ హెచ్చరిస్తూ, తన చెలి అతని వియోగం ఏ మాత్రం భరించలేదనీ...చెబుతోంది. మరి ఎలా..
అంతరార్ధం... అతనెంత పర్వతాల్లో తిరిగినవాడైనా అర్ధరాత్రి కొండదారి ప్రమాదం అని, తన సఖిని మనువాడితే, ఈ అర్ధరాత్రి ప్రమాదకరమైన ప్రయాణాలు తప్పుతాయి కదా అని చెప్పడఁవూ ఉంది.
ఇలా పదాలు, ప్రాచీన తమిళ భాషలో రాయబడ్డాయి.. వీటిని అనేకమంది ఇంగ్లీషు లో అనువదించారు... అంతే కాదు వీటికి పెద్ద చరిత్రే ఉంది.

Ms Grace Piradhiba బ్లాగ్ చదివి తనతో చెప్పి ఇలా నాబ్లాగ్ లో రాసుకోవడానికి పర్మిషన్ అడిగా....తనెంతో సంతోషంగా వొప్పుకొంది... తమిళ సాహిత్యం అందరికీ తెలియడం మంచిదేగా అంటూ. తన బ్లాగ్ లింక్ కూడా ఇస్తున్నా.

http://sangamliteratureinenglish.blogspot.com/search/label/Introduction%20to%20Sangam%20Literature?m=0





No comments:

Post a Comment